నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి లైసెన్స్ లేని మెడికల్ షాపులు వెంటనే సీజ్ చేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మెడికల్ మాఫియా అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మదనపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేష్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టీ. కృష్ణప్ప, ఏరియా కార్యదర్శి పీ. మురళీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అవసరం లేకున్నా టెస్టులు చేయించి వేల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న అన్ని మెడికల్ స్టోర్ల వివరాలు, లైసెన్సుల స్థితి, అనుమతి లేకుండా నడుస్తున్న దుకాణాలపై పూర్తి వివరాలతో జాబితా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వైద్య సేవలు, పరీక్షలు, ఔషధాలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను పట్టిక రూపంలో రూపొందించి ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని కోరారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి దందాలకు పాల్పడుతున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతిలేని అబార్షన్ మాత్రల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లైసెన్స్ లేని మెడికల్ స్టోర్లను తక్షణమే సీజ్ చేసి, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో విభాగం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సలు జరగకపోవడం, వైద్యులు ప్రైవేట్ క్లినిక్స్కు ప్రాధాన్యత ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిని నియమించి, తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించాల్సిందిగా డిమాండ్ చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె. మాధవ్, మునెప్ప, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News