నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 ః లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ముక్కంటి నిలయాలుగా నిలిచిన తంబళ్లపల్లె (సాధు, ఇనుము, మల్లయ్య) మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది జీవరాశులు, మూగజీవాలు, వేలాదిమంది అటవీ శివార్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో పర్యావరణం కాలుష్యమై మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ఆ మహా శివుడు సాదుకొండ నుండి సొరంగ మార్గంలో ఇనుము కొండ ద్వారా మల్లయ్య కొండ చేరి స్థిరపడినట్లు పురాణాలు చెబుతున్నాయని దీంతోపాటు స్థానిక లక్షలాది శివ భక్తుల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని ఈ ప్రాంతంలో మైనింగ్ చేపడితే వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి తో అనారోగ్యాలు, భూములు నిస్సారమై పంటలకు పనికి రాకుండా పోయి ఎడారి ప్రాంతం లా మారుతుందని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. నేడు తంబళ్లపల్లె ప్రాంతానికి మల్లయ్య కొండలు పెట్టని కోటలా అటవీ ప్రాంతం పచ్చటి పర్యావరణం, లక్షలాది వన్యప్రాణులు, పశు పక్షాదులు, జీవరాసులు ఆశ్రయం కోల్పోవడంతో పాటు ఈ కొండలను నమ్ముకున్న కొండ శివారు ప్రాంతాలలోని వందలాది గ్రామాల ప్రజలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. మల్లయ్య కొండ ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిచి లక్షలాదిమంది భక్తులకు మహాశివుడు ఆరాధ్య దైవంగా నిలిచాడని ఇలాంటి పవిత్రమైన కొండలను మైనింగ్ కు అప్పజెప్పడం స్థానిక ప్రజలకు శరాఘాతంగా తయారవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మైనింగ్ కార్యక్రమాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు
Reporter
Namitha News