నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 28: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, శాసనసభ్యులు షాజహాన్ భాషలు పేర్కొన్నారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో గురువారం స్టెప్ మరియు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారు తెలుగు సినీ రంగంలో అపూర్వమైన కీర్తిని సాధించడమే కాకుండా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. 1949లో “మనదేశం” సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, సామాజిక, చారిత్రక, పౌరాణిక చిత్రాల్లో నటించి కోట్లాది ప్రజల అభిమానాన్ని సంపాదించారని తెలిపారు. ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరమశివుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రాజకీయ నాయకుడిగా కూడా ఎన్టీఆర్ గారు ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా తాలూకాలను మండలాలుగా విభజించి గ్రామీణ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశారని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, రూ.2లకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం వంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంక్షేమ పాలనకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. మహిళా విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు
మదనపల్లి ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారు మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే దృఢ సంకల్ప నాయకుడని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా భావించి అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వెంటనే పరిష్కార మార్గాలు చూపిన మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆలోచనలు, ప్రజాసేవా తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ గారు తెలుగు సినీ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహానటుడని తెలిపారు. పౌరాణిక, చారిత్రక, సామాజిక చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. సినీ రంగంలో సాధించిన ప్రజాదరణను ప్రజా సేవకు వినియోగించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సంక్షేమానికి కృషి చేశారని పేర్కొన్నారు. కళాకారుడిగా మాత్రమే కాకుండా సమాజ సేవకుడిగా కూడా ఎన్టీఆర్ గారు చిరస్మరణీయులయ్యారని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం శాఖ అధికారి నాగభూషణం, డీఎల్డీఓ లక్ష్మీపతి, జిల్లా క్రీడల అధికారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News