నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లాలో జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేసి అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఇంజనీరింగ్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గతవారం, ప్రస్తుత వారంలో సాధించిన ప్రగతిని పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మండలాల వారీగా కార్యక్రమాల అమలు ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించగా, పనుల్లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పనిని ఖచ్చితమైన కొలతలతో వందశాతం నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో చెరువులు, వాగులు, వంకలను గుర్తించి వాటి నీటి ప్రవాహ మార్గాలను ఆర్డర్-1, 2, 3 ప్రకారం అనుసంధానం చేసి ఒక చెరువు నిండిన తర్వాత మరొక చెరువుకు నీరు చేరే విధంగా వ్యవస్థను పునరుద్ధరించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో వాటర్ రిసోర్స్ అధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ మరియు ఫీల్డ్ సిబ్బంది స్థానిక వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలతో సమావేశాలు నిర్వహించి చెరువుల స్థితిగతులను తెలుసుకోవాలని తెలిపారు. గత ఏడాది చెరువుల నింపుదలపై పూర్తి సమాచారం సేకరించి, నీరు చేరని చెరువులను ప్రాధాన్యతగా తీసుకుని కారణాలను గుర్తించాలని సూచించారు. వాగులు, కాలువలు పూడికతో నిండిపోవడం, ఆక్రమణలు, చెట్ల పెరుగుదల వంటి సమస్యలను ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నరేగా కార్మికులతో పూడికతీత, కాలువల శుభ్రత, చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని, ఆక్రమణలను రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని తొలగించాలని సూచించారు. కొండల నుంచి వచ్చే నీరు చెరువులకు చేరేలా సహజ ప్రవాహ మార్గాలను పునరుద్ధరించాలని, సరఫరా కాలువలు, స్లూసులు, సర్ప్లస్ వీర్లలో లీకేజీలను సరిచేయాలని తెలిపారు. బోర్వెల్ ఆధారిత వరి సాగును తగ్గించి సూక్ష్మ సేద్యం ద్వారా ఉద్యాన, పూల సాగును ప్రోత్సహించాలని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, డ్వామా ఏపీడీలు, ఇంజనీరింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News