నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 12 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమాన్ని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మరియు విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి, విద్యార్థుల నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ యన్. ద్వారకానాథ్ మాట్లాడుతూ మిట్స్ కళాశాల స్థాయి నుండి నేడు యూనివర్సిటీ స్థాయికి చేరుకోవడం వెనుక తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని అన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మరియు తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకుని, మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలని, అందుకు కావాల్సిన సహాయ సహకారాలు యూనివర్సిటీ యాజమాన్యం అందిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు క్రమశిక్షణ తో కూడిన విద్య ద్వారా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ లలో ఉద్యోగఅవకాశాల కోసం యూనివర్సిటీ అధ్యాపకులు నిరంతరం నూతన కోర్సులు నేర్పించి వారి ఉన్నతికి దోహదపడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల భాద్యత వహిస్తూ, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు అవుతున్నారా లేదా అనే విషయాలను తరచూ కళాశాలకు రావడం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. విద్యార్థులు నూతన టెక్నాలజీలపై అవగాహన పెంచుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, అధ్యాపకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News