నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రాణరక్షణ కవచం.. 'హెల్మెట్ కలకడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 500 హెల్మెట్ల పంపిణీ.. అవగాహన కల్పించిన పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచే హెల్మెట్ వాడకంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ పిలుపునిచ్చారు. సోమవారం కలకడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'యూ కాంప్లెక్స్' వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై వాహనదారులకు 500 ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "ప్రతి ప్రాణం ఎంతో విలువైందని, క్షణికావేశంలో, నిర్లక్ష్యంతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం చలాన్ల భయంతోనో, పోలీసుల కోసమో కాకుండా.. ఇంట్లో మనకోసం ఎదురుచూసే మన కుటుంబ సభ్యుల కోసం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతతో పోలీసు శాఖ సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని" ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలకడ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మన్న, రాయచోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కుళాయప్ప, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసుల రెడ్డి మరియు కలకడ పోలీసు సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News