నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 24 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు జే.ఎన్.టి.యూ, అనంతపూర్ వారి సహకారంతో ఆధునిక డేటా సాధనాలతో దృశ్యీకరణ ఆధారంగా ముందస్తు విశ్లేషణ” అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుదుచ్చేరి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ ప్రవీణ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో డేటా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆ డేటాను అర్థం చేసుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం అని అన్నారు. డేటాను గ్రాఫ్లు, చార్ట్లు వంటి దృశ్య రూపంలో చూపించడం వల్ల క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా గత డేటాను విశ్లేషించి భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఇది వ్యాపారం, విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో ప్రణాళికలు రూపొందించడంలో మరియు సమస్యలను ముందుగానే గుర్తించడంలో ఉపయోగపడుతుందని అన్నారు. ఆధునిక డేటా టూల్స్ అయిన పవర్ బి.ఐ, పైథాన్, ట్యాబ్లు వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా విశ్లేషణ వేగవంతంగా, ఖచ్చితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఈ సాధనాలను ఉపయోగించడం ద్వారా విద్యా రంగంలో బోధన మరింత సమర్థవంతంగా మార్చి, విద్యార్థులకు ప్రాక్టికల్ జ్ఞానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐటీ, ఫైనాన్స్, హెల్త్కేర్, ఈ-కామర్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధ్యాపకులు తమ బోధనా విధానాలను మరింత ఆధునికంగా మార్చుకొని, వారు నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు ప్రాక్టికల్గా బోధించడం ద్వారా వారి అవగాహనను పెంచుకొని, పరిశోధన మరియు ప్రాజెక్టులలో కొత్త అవకాశాలను అన్వేషించగలరు అని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ .కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. బి రాజేష్, మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేటర్ ట్రైనర్, ఆశు దేవ్, బెంగళూరు మరియు 50 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News