నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఐ.టి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కంపెనీను సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమలోని ప్రత్యక్ష అనుభవం మరియు ఆధునిక పరిశోధనలపై అవగాహన కల్పించడం ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్శనలో కంపెనీ ప్రతినిధులు ఆశ హొళ్ళ మరియు అఖిల్ విద్యార్థులకు ఏజెంటిక్ ఏ.ఐ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అనే అంశాలను సులభంగా వివరించారు. స్వయంచాలకంగా నిర్ణయాలు తీసుకునే ఏ.ఐ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో, వాటిని వాస్తవ జీవితంలో ఎలా ఉపయోగించవచ్చో తెలియజేశారు. అదేవిధంగా కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహనాత్మక మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు జెనెరేటివ్ ఏ.ఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంపొందించుకుని భవిష్యత్ కెరీర్కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ జెనిఫర్, జె. విశ్వనాథ్ ల అధ్యాపక బృందం మరియు 50 విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News