నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె -జనవరి 17 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో చింతపండు లభ్యత ప్రతీ సంవత్సరం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చింతపండు కు భౌగోళిక సూచిక జియో ట్యాగ్ కోసం అధికారికంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీ సాయి టామరిండ్ సొసైటీ వారి తరపున ఈ జీఐ దరఖాస్తును చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపీఆర్ కార్యాలయానికి దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో మదనపల్లె పరిసర ప్రాంత చింతపండు కు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని ఆయన అన్నారు. మిట్స్ యూనివర్సిటీలోని పరిశోధనా విభాగం మరియు మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ సహకారంతో మదనపల్లె ప్రాంతంలో చింతపండు సాగు, ఉత్పత్తి మరియు మార్కెట్ లభ్యతపై అధ్యయనం నిర్వహించామని ఆయన చెప్పారు. ఇక్కడి చింతపండు గాఢమైన పులుపు, మంచి గుజ్జు శాతం, సహజ రంగు, దీర్ఘకాలం నిల్వ ఉండే లక్షణాలు కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రత్యేక లక్షణాలు మదనపల్లె ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, వాతావరణం మరియు నేల స్వభావంతో ముడిపడి ఉన్నాయని వివరించారు. మదనపల్లె మరియు పరిసర మండలాల్లోని చింతపండు సాగుదారులు, ఉత్పత్తిదారుల సంఘాలు కలిసి స్థానిక మార్కెట్లు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాలకు కూడా చింతపండు సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చే చింతపండు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ను పొందుతోందని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా చింతపండు సాగుదారులకు సరైన మార్కెట్ సమాచారం అందించడంతో పాటు, మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా మంచి ధర లభించే విధానాలు రూపొందించేందుకు అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అలాగే భవిష్యత్తులో మదనపల్లె చింతపండుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన శ్రీ సాయి ట్యామరిండ్ సొసైటీ, మదనపల్లె , మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ బృందాలను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్&డి) డా. పి. శివయ్య, ఉత్పత్తిదారుల కంపెనీ అధ్యక్షులు వెంకట రెడ్డి లు పాల్గొన్నారు.
Reporter
Namitha News