నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో స్పష్టంగా తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల వద్ద నుండీ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ డివిజన్, సర్కిల్, మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఎస్పీ గారు ఈ సందర్భంగా పోలీసు అధికారులను ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి సమస్యలను పూర్తిగా విని చట్ట పరిధిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మరియు మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దూరప్రాంతాల నుండి వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ కార్యాలయ సిబ్బంది ప్రత్యేకంగా సహాయక సహకారాలు అందించి, వారు ప్రశాంతమైన వాతావరణంలో తమ సమస్యలను వివరించుకునేలా చొరవ చూపారు. సమస్య తీవ్రత ఎలాంటిదైనా సరే, చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువు లోపల ఖచ్చితమైన పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఎస్పీ గారు పేర్కొన్నారు. బాధితులు తమ సమస్యల పట్ల ఎలాంటి అధైర్యానికి లోనుకాకుండా, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు సమర్పించి న్యాయం పొందవచ్చని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈ సందర్భంగా ప్రజలకు భరోసా కల్పించారు
Reporter
Namitha News