నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 15 : తంబళ్లపల్లి మండలంలోని వాహన చోదకులు కచ్చితంగా రోడ్డు భద్రత పాటించి క్షేమంగా ఇళ్లకు చేరాలని ఎస్సై టి అనిల్ కుమార్ హితబోధ చేశారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. వాహనం డ్రైవర్లు ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ వాడాలని, అతివేగం, మద్యం సేవించి బండి నడపడం చేయరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలైన జూదం, కోడి పందాలు, సైబర్ నేరాలు, గంజాయి, బెల్ట్ షాప్ నిర్వహణ, బహిరంగ మద్యం సేవించడం, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల ఈవిటీజింగ్ లాంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రజలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. పై అసాంఘిక కార్యక్రమాలపై మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలు సైతం సహకరించి ఈ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి నేర రహిత సమాజం కోసం తమతో కలసి రావాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనం డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News