నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జూన్ 20 : రైతు సంక్షేమం, సాగునీరు, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మరియు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని సాయిశుభ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో.. పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ నిధులను, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను 2026–27 ఆర్థిక సంవత్సరానికి తొలి విడత కింద జిల్లాలోని 1.64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.110.77 కోట్ల ఆర్థిక సాయాన్ని వర్చువల్ గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం ద్వారా గత ఏడాది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 60 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ఈ విడతలో రాయచోటి నియోజకవర్గంలోని సుమారు 34 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. రైతు పెట్టుబడి భారం తగ్గించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, యూరియా సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ–ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో రైతాంగానికి అనేక ప్రయోజనకర పథకాలు అమలు చేశామని, రైతుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని తెలిపారు. జలధార పథకం ద్వారా చెరువులు, కాలువలు, నీటి వనరులను అనుసంధానం చేసి భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ పథకం అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలవుతూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. రాయచోటి ప్రాంతంలో చెక్డ్యామ్లు, చెరువుల పునరుద్ధరణ, కాలువల పూడిక తొలగింపు వంటి చర్యల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మాండవ్య నది అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పెంపు కోసం చర్యలు ప్రారంభిస్తున్నామన్నారు. రాయచోటి పట్టణ తాగునీటి అవసరాల దృష్ట్యా రెండో పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే కాలంలో పట్టణ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందించేలా ప్రణాళికలు అమలు చేస్తామని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఆరు మండలాలకు రూ.450 కోట్లతో ఇంటింటికీ తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని తెలిపారు. రోడ్ల నిర్మాణం, గుంతల మరమ్మతులు, గ్రామీణ కనెక్టివిటీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. రాయచోటిలో కొత్త బస్టాండ్, ఇండోర్ స్టేడియం, పార్కుల నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి, క్రీడా మౌలిక వసతుల విస్తరణ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో రాబోయే మూడేళ్లలో రాయచోటి నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ... అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 వ్యవసాయ సంవత్సరానికి తొలి విడత ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,64 లక్షల మంది రైతులకు రూ.110.77 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందన్నారు. నియోజకవర్గాల వారీగా రాయచోటికి రూ.25.22 కోట్లు, మదనపల్లెకు రూ.13.25కోట్లు, పీలేరుకు రూ.25.20 కోట్లు, తంబళ్లపల్లెకు రూ.29.25 కోట్లు, పుంగనూరుకు రూ.17.85 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. రైతులు ఈ నిధులను వ్యవసాయ పెట్టుబడులకు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, వాతావరణ అంచనాల ప్రకారం వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే జూన్ నెలలో గణనీయంగా తక్కువ వర్షపాతం నమోదైందని, దీనివల్ల వ్యవసాయ కార్యకలాపాలు కొంత వెనుకబడ్డాయని చెప్పారు. బోరువెల్ ఆధారంగా వరి సాగును తగ్గించి, నీటి పొదుపు చేసే మైక్రో ఇరిగేషన్ విధానాలు, ఉద్యాన పంటల సాగు వైపు రైతులు మళ్లాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన, మైక్రో ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జలధార పథకం ద్వారా ప్రస్తుతం నీటి అందుబాటు ఉన్నప్పటికీ రానున్న కాలంలో నీటి వినియోగంపై రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా నీటి వృథా నివారించి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాయచోటి మున్సిపాలిటీ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.124 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఆ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల్లో రాయచోటి తాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చూపేలా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. లక్కిరెడ్డిపల్లిలో ప్రజల అవసరాల కోసం పబ్లిక్ వాష్రూమ్ నిర్మాణానికి రూ.7 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. మాండవ్య నది అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు చేశామని, బండ్పై వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026-27 సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన నిధులు మెగా చెక్కును మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు
ఈ కార్యక్రమంలో ముందుగా వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మరియు జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీ చైర్మన్ కే భాస్కర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, ఎల్ఆర్ పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ షఫీ నాయక్, అటవీ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు రెడ్డయ్య యాదవ్, బాలచంద్ర, ఎస్. మస్తాన్ బీ, వైస్ చైర్మన్లు మల్లికార్జున, శ్రీనివాసులు నాయుడు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News