నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా - ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.వనజ వెల్లడి మదనపల్లె : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ (నారీశక్తి నందన్ అధినీయమ్) బిల్లు అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు సోమవారం స్త్రీ శక్తి పేరిట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఎరికిపాటి వనజ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ మహిళల కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపరిచారని,తద్వారా మహిళలు అని రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు.అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న (నారీశక్తి నందన్ అధినీయమ్) పథకం మహిళా సాధికారతకు భరోసానిస్తుందన్నారు.ఇది రాజకీయ సమానత్వానికి దోహదపడుతుందన్నారు.2029 సంవత్సరం నుండి ఈ బిల్లు అమలులోకి వస్తుందని వెల్లడించారు.మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.విపత్కర పరిస్థితుల్లో మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగడానికి ఈ చట్టాలను వినియోగించుకోవాలన్నారు.అనంతరం కో-ఆర్డినేటర్ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఉపయోగపడే అనేక పథకాలు,కార్యక్రమాలను రూపొందించాయన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభసూచకమన్నారు.నూతనంగా తీసుకొస్తున్న ఈ చట్టం మహిళలకు ఓ వరమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాస్మిన్,నాగమణి,బషీర్ అహ్మద్ మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.
Reporter
Namitha News