నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెకు వచ్చారు... ఇక్కడి రోడ్లు చూడండి -- మదనపల్లె టౌన్లో రహదారి వెడల్పుపై దృష్టి సారించండి -- రోడ్లు భవనాల శాఖ మంత్రిని కోరిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ -- మదనపల్లె మున్సిపాలిటీ 30 వ వార్డులో కోటి సంతకాల రచ్చబండ మదనపల్లె రోడ్ల దుస్థితిపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ కోరారు. బుధవారం మదనపల్లె మున్సిపాలిటీ 30 వార్డులో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్, పరిశీలకులు అనూష రెడ్డి ముఖ్య అతిధిలుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లెలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని కోరారు. వై జంక్షన్ శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. నిత్యం వివిధ పనుల మీద ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇక్కడి రోడ్ల పరిస్థితిపై చర్చించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా బాహుదా కాలువ పై కొత్తగా బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పట్టణం రోడ్లు వెడల్పు ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. బెంగుళూరు రోడ్డుకు బైపాస్ వేయాలని, తద్వారా పట్టణంలో ట్రాఫిక్ తగ్గుతుందని సూచించారు. మదనపల్లె నుంచి రామసముద్రం, నిమ్మనపల్లె, బెంగుళూరు రహదారి గుంతల మాయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కాకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వీటిపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. వైద్య కళాశాలు పిపిపి విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించే మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఆధునిక యంత్ర పరికరాలు గుంటూరుకు తరలింపు సమంజసం కాదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పధకం నేడు నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు గ్రాంట్ చెల్లింపు సక్రమంగా లేక చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిరాకరించి పేదలకు వైద్య అందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అనూష రెడ్డి, తట్టి శ్రీనివాసులు రెడ్డి, సరిత, డా. అనిల్ రెడ్డి, ప్రసాద్ బాబు, ఈశ్వర్ నాయక్, బాలగంగాధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, రవి, రఫీ, మాధవరెడ్డి, శారదా రెడ్డి, యూనస్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, వినీతా బాయి పాల్గొన్నారు.
Reporter
Namitha News