నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సబ్-రిజిస్ట్రార్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్... రూ.50 లక్షలు, ఇంటి స్థలం డిమాండ్.. మదనపల్లి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రభుత్వ అధికారి అయిన సబ్-రిజిస్ట్రార్ ను లక్ష్యంగా చేసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మదనపల్లె వన్ టౌన్ పోలీసుల తెలిపిన వివరాల మేరకు, చిత్తూరు జిల్లాకు చెందిన పెన్ పవర్ విలేఖరి బూరగన్ దొర స్వామి (45), మదనపల్లెకు చెందిన మాజీ సబ్ రిజిస్టర్ మోసూరు కోదండరామయ్య (65) కలిసి బాధితుని వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన స్థిరాస్తి వివరాలను సేకరించారు. ఆ వివరాలను ఆధారంగా తీసుకొని ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా బాధితుడు మరియు అతని బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి పంపిస్తూ ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో ఒక ఇంటి స్థలం ఇవ్వాలని లేకపోతే దానికి సమానంగా రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా మార్చి 26న మదనపల్లి–బెంగుళూరు హైవేపై అభి హోటల్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది తెలిపారు.
Reporter
Namitha News