నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15: జిల్లాలో 22ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 22ఏ రిమూవల్ కేసులు, రీ సర్వే, రెవిన్యూ రికార్డుల డిజిటైజేషన్, జలధార ప్రాజెక్టు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ చుక్కల భూముల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో రీ సర్వే పనులను పటిష్టంగా అమలు చేసి 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని, అనంతరం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలని తెలిపారు. ఇందుకోసం పెండింగ్ మ్యుటేషన్స్, సబ్ డివిజన్ పనులను జూన్ 2026 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మే, జూన్ నెలలకు సంబంధించిన విఎస్ లాగిన్, తాసిల్దార్ లెవెల్ ప్రాసెసింగ్, 13 నోటిఫికేషన్, వెబ్ల్యాండ్ ఎంట్రీలు మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలను సమయపాలనతో పూర్తి చేయాలని సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జీరో ఎర్రర్స్తో జారీ చేయాలని, తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
జలధార – జలహారతి ప్రాజెక్టు కింద వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని చెరువులు నిండేలా శాస్త్రీయ ప్రణాళికతో పనులు చేపట్టాలని, మేజర్, మైనర్, మీడియం రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలు వంటి నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవాలని సూచించారు. పడే ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసుకునేలా నీటి సంరక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో చెరువుల వివరాలను సేకరించి, అవి పూర్తిగా నిండుతున్నాయా, సగం నిండుతున్నాయా, లేదా నిండకపోవడానికి కారణాలు ఏమిటో గుర్తించాలని ఆదేశించారు. ప్రతి ట్యాంక్కు సంబంధించిన ఫీడర్ చానళ్ల శుభ్రపరిచడం, స్థానిక వాగులు, వంకలు, మైనర్, మీడియం, మేజర్ కాలువల క్లియరెన్స్ చేపట్టాలని సూచించారు. చెరువుల మధ్య నీటి ప్రవాహానికి అడ్డంకులుగా ఉన్న ఆక్రమణలను తొలగించి, కాస్కేడ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పీడీ వెంకటరత్నం, సర్వే శాఖ ఏడి భరత్ కుమార్, భూగర్భజల శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నరు
Reporter
Namitha News