నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11: గ్రామీణ ప్రభుత్వ పాఠశాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి అన్నమయ్య జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటిన చిన్నారి విద్యార్థి బి. శైలేష్ గౌడ్ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ముంబైలో ఏప్రిల్ 22న నిర్వహించిన నేషనల్ లెవల్ స్పెల్లింగ్ బీ పోటీలలో దేశవ్యాప్తంగా ప్రతిభావంతుల మధ్య పోటీపడి.. జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ (2వ తరగతి విద్యార్థి)ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి శైలేష్ గౌడ్ నైపుణ్యాన్ని కలెక్టర్ కొద్దిసేపు పరీక్షించి.. విద్యార్థి ప్రతిభకు ముగ్ధులయ్యారు. విద్యార్థికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శైలేష్ గౌడ్, తన చిన్న వయస్సులోనే అసాధారణ ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమన్నారు. ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డి సమర్థమైన మార్గదర్శకత్వంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలలో వరుసగా ప్రథమ స్థానాలు సాధించి, అనంతరం జాతీయ స్థాయిలో దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులతో పోటీపడి సెకండ్ ర్యాంక్ సాధించడం అన్నమయ్య జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ తరగతి గది నుంచి దేశ స్థాయి వేదికపై నిలవడం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తెలిపారు. "ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టపడి సాధించాలనే తపన, ఉపాధ్యాయుల సమర్థమైన మార్గదర్శకత్వం ఉంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని శైలేష్ విజయం మరోసారి నిరూపించిందని" అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, ఆ ప్రతిభను గుర్తించి సరైన దిశలో తీర్చిదిద్దితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం సాధ్యమని పేర్కొన్నారు. శైలేష్ సాధించిన విజయం జిల్లాలోని వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి శైలేష్ గౌడ్ను, ఆయన తండ్రి కిషోర్, అలాగే విద్యార్థిని నిరంతరం ప్రోత్సహించి విజయపథంలో నడిపించిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా విద్యాశాఖ పనితీరును మరింత మెరుగుపరచుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులను జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల నుంచి మరెందరో విద్యార్థులు దేశ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ అభినందనలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయుడు మధుకర్ రెడ్డి, విద్యార్థి శైలేష్, విద్యార్థి తండ్రి కిషోర్ తెలిపారు. ఈ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన విద్యాశాఖ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డా. కె. సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News