నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 23 : తంబళ్లపల్లె మండలంలో నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార-జల హారతి కార్యక్రమానికి సహకరించే దాతలను అన్వేషించాలని అధికారులను తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మరియు డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారుల గైర్హాజర్ తోబాటు వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సిన అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయం, హార్టికల్చర్, సిరికల్చర్, మైనర్ ఇరిగేషన్, ఫారెస్ట్, ఉపాధి హామీ శాఖల పనితీరుపై ఆరా తీశారు. ప్రాణాధారమైన నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి నీటి బొట్టును ఎక్కడికక్కడ నిలువరించి తద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి తోబాటు పర్యావరణం పరిరక్షణ జరుగుతుందన్నారు. పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, ప్రకృతి వ్యవసాయంతో పలు రకాల పంటలు,కూరగాయలు, ఆకుకూరలు పంటలు వేయడానికి సహకరించాలన్నారు. జలధార-జలహారతి పనులు వేగవంతం చేసి చెరువులు, కుంటలు నీటి వనరులు సంరక్షించి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ సమీక్ష లో ఎంపీడీవో ఎంవీ ప్రసాద్, ఇరిగేషన్ ఏఈ సతీష్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, 2047 విజన్ సూపర్వైజర్ రెడ్డప్పలు పాల్గొన్నారు
Reporter
Namitha News