నమిత న్యూస్ - Andhra Pradesh / : రాయచోటి - జనవరి 16: సంక్రాంతి సంబరాలు ముగిశాయి. పల్లె సీమల్లోని ఆత్మీయతలు, పిండివంటల రుచులు, బంధుమిత్రుల పలకరింపులతో నిండిన తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుని అన్నమయ్య జిల్లా ప్రజలు తిరిగి తమ గమ్యస్థానాలకు బయలుదేరుతున్నారు. అయితే, మీ తిరుగు ప్రయాణం సంతోషంగా సాగాలని, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ ఇళ్లకు చేరుకోవాలని *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.* ఈ సందర్భంగా ప్రయాణీకులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయన ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. "పండుగ తెచ్చిన ఉత్సాహం ప్రయాణంలోనూ కొనసాగాలి. తొందరపాటుతో చేసే చిన్న పొరపాటు మీ కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చకూడదు. అందుకే ప్రయాణంలో క్రమశిక్షణ పాటించండి" అని ఎస్పీ గారు కోరారు. రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే సమయం ఇది. అందుకే నిర్ణీత వేగంతో ప్రయాణించండి. గమ్యం చేరడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యం. సుదీర్ఘ దూరం ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రమత్తుగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని సురక్షితమైన చోట ఆపి విశ్రాంతి తీసుకోండి. బస్సుల్లో, రైళ్లలో వెళ్లేవారు కొత్త వ్యక్తులు ఇచ్చే బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటివి ఆశించవద్దు. మత్తు మందు ఇచ్చి దోచుకునే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఇది మీ ప్రాణానికి రక్షణ కవచం. పండుగ సరదాలో మద్యం సేవించి స్టీరింగ్ పట్టుకోవడం చట్టరీత్యా నేరమే కాదు, అది ఆత్మహత్యాసదృశ్యం. "మీ ప్రయాణ మార్గంలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా, లేదా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సంకోచించకుండా, స్థానిక పోలీస్ స్టేషన్, లేదా డయల్ 112 కి సమాచారం అందించండి. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మీకు తోడుగా ఉంటాయి" అని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. పండుగ వేడుకలు ఇచ్చిన నూతనోత్సాహంతో అందరూ క్షేమంగా తమ గమ్యం చేరాలని, మీ ప్రయాణం సుఖమయంగా సాగాలని అన్నమయ్య జిల్లా పోలీస్ కుటుంబం మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది
Admin
Namitha News