నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 11 : మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని ఈఈఈ విభాగానికి చెందిన విద్యార్థులు “ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ” అనే వినూత్న ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. మిట్స్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డీన్ డా. ఏ.వి. పవన్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు అభివృద్ధి చేసిన “ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ” బ్యాటరీల భద్రత, పనితీరు మరియు విశ్వసనీయతను మెరుగుపరచే వినూత్న పరిష్కారమని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా బ్యాటరీలోని వోల్టేజ్, కరెంట్, ఉష్ణోగ్రత వంటి కీలక సూచికలు తక్షణమే పర్యవేక్షించడంతో పాటు, బ్యాటరీ చార్జ్ స్థితి (SOC), ఆరోగ్య స్థితి (SOH)లను కూడా అంచనా వేయవచ్చని అన్నారు . హిస్టెరిసిస్ నియంత్రణ పద్ధతిలో పనిచేసే శీతలీకరణ వ్యవస్థ ద్వారా బ్యాటరీ ఉష్ణోగ్రతను సమర్థవంతంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే వై-ఫై సాంకేతికత సహాయంతో థింగ్స్పీక్ క్లౌడ్ వేదికపై దూర పర్యవేక్షణ, డేటా నిల్వ సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, అధిక కరెంట్, తక్కువ వోల్టేజ్ వంటి ప్రమాదకర పరిస్థితులను గుర్తించి తక్షణ హెచ్చరికలను అందించే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకత అని తెలిపారు. ప్రయోగాత్మక పరీక్షల్లో ఈ వ్యవస్థ అత్యుత్తమ ఫలితాలను సాధించిందని, ఎలక్ట్రిక్ వాహనాలు, పునర్వినియోగ శక్తి నిల్వ వ్యవస్థలు మరియు స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ రంగాల్లో ఇది విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం రూ.8,000 వ్యయంతో రూపొందించిన ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన సాంకేతిక పరిష్కారంగా నిలిచిందని, ఈ ప్రాజెక్టు యొక్క వినూత్న రూపకల్పనకు సంబంధించి భారతీయ పేటెంట్ దరఖాస్తును మిట్స్ మరియు ఐపీఎఫ్సీ సంస్థల ద్వారా దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును డాక్టర్. ఏ.వి. పవన్ కుమార్ పర్యవేక్షణలో ఎన్. నిహంత్ కుమార్, ఎ. నాగ వర్ధన్ రెడ్డి, సి. నవ్య శ్రీ, ఎస్. షాహుల్ హుస్సేన్ విజయవంతంగా రూపొందించారు
Reporter
Namitha News