నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : చాలీచాలని జీతాలతో జీవిస్తున్న అంగన్వాడి మహిళామతల్లుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అంగన్వాడీ మహిళలకు హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం అంగన్వాడి కార్యకర్తలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి స్వగృహం చేరుకుని తమ సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమకు కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలని, మే నెల వేసవి సెలవులు ప్రకటించాలని, హెల్పర్ల ప్రమోషన్ జీవో నెంబర్ 5 సవరించాలని, పెండింగ్ లోని మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మార్పు చేయాలని డిమాండ్లను ఎమ్మెల్యేకు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమంతో పాటు చిన్నారుల పాలిట తల్లులుగా ఆలనా పాలనా చూస్తున్న అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం సోచనీమన్నారు. అంగన్వాడీలకు పనిభారం పెంచి రకరకాల యాప్ ల ద్వారా వెట్టి చాకిరి చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వాలని, 20 26 మార్చి బడ్జెట్ లో అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నేటి నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు జీతాలు పెంచి వారి పని భారం తగ్గించి వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే కూటమి ప్రభుత్వానికి అంగన్వాడి మహిళల శాపం తగిలి తీరుతుందని హెచ్చరించారు. మీ సమస్యల పరిష్కారానికి ఓ సోదరుడుగా అండగా నిలబడి పోరాటంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అంగన్వాడీలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, పరుసతోపు సర్పంచ్ శ్రీనివాసులు, నరేందర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరిముల్లా నాయకులు, వందలాది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News