నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 18 : దేశంలో దళిత, గిరిజన, మైనార్టీలపై కొనసాగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ,జన గణనలో కుల గణన చేపట్టాలని, కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని,సామాజికన్యాయం-సమానత్వం-ఆత్మగౌరవం కోసం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా,సిపిఐ బీ.కొత్తకోట మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక జ్యోతి చౌక్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీయ అంబేద్కర్ సేన (బాస్) తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది.సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి,బాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సచిన్ లు మాట్లాడుతూ; కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన 11 ఏళ్ల కాలంలో దళిత,గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయని, దేశంలో మతోన్మాద పాలన కొనసాగుతుందని,అణచివేత,అంటరానితనం,కుల, మత వివక్షత,హింస పెట్రేగిపోతున్నాయని ఆవేదన చెందారు. ఆర్ఎస్ఎస్,సంఘ్ పరివార్ కనుసన్నలలో భారత రాజ్యాంగ,లౌకిక, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులైన సామాజిక న్యాయం, సమానత్వం,సౌభ్రాతృత్వానికి పాతర వేస్తున్నారని విమర్శించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో -20 23 నివేదిక ప్రకారం ఎస్సీ కులాల వారిపై జరిగిన నేరాలకు 57,789 కేసులు, ఎస్టీ కులాల వారిపై జరిగిన నేరాలకు 12,960 కేసులు నమోదు అవ్వగా, మహిళలపై 4.48 లక్షలు నేరాలు నమోదవ్వడం విచారకరమన్నారు. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయిపై సనాతనవాది దాడికి పాల్పడిన ఘటన ఒక మచ్చుతునక మాత్రమేనని,మోడీ పాలనలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు రక్షణ ప్రశ్నార్థకమైందని ఆవేదన చెందారు.ప్రశ్నించే వారిపై మతోన్మాదులు దాడులకు హత్యలకు తెగబడుతున్నారని, గిరిజనుల పొట్ట కొట్టేలా, అడవి బిడ్డల హక్కులను హరించేలా అడవులను, సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని వాపోయారు.ఈ పరిస్థితులలో భారత రాజ్యాంగం,ప్రజాస్వామిక హక్కులను హరించే దుష్టశక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రచించుకునేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు, లౌకిక వ్యవస్థను కాపాడేందుకు ప్రజలంతా నడుం కట్టాలని విజ్ఞప్తి చేశారు.సిపిఐ సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు మాట్లాడుతూ;మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలున్నాయని,గత స్థానిక సంస్థలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులను బీసీలు కోల్పోయారని అన్నారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జనగణనలో కుల గణనను చేపట్టి,కులాల ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం.అష్రఫ్ అల్లి,పి.నారాయణ స్వామి,ఎం.గంగులప్ప,దుమ్ము.బాబు,హబీబ్,వి.లక్ష్మన్న,మనోహర్,గంగాధర్,రియాజ్,కార్మికనాయకులు, జి. నారాయణ స్వామి, దళిత సంఘం నాయకులు రామచంద్ర,బాస్ నాయకులు మాధవ, వెంకటేష్,గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News