నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 30 : పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలో మంగళవారం ముడి పాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల అవగాహన ఎంతో కీలకమని ఆయన అన్నారు. చిన్న లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్వో కోరారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన తెలిపారు. అనంతరం పీహెచ్సీ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో జ్వరాలు, వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని చెప్పారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు ఏర్పడకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ఆయన వివరించారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు పొందారు.
Reporter
Namitha News