నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోలీసుల తీరుకు నిరసనగా బాస్ నేత మౌన దీక్ష -- బుద్ధునికొండ పై ఆంక్షలు తొలగించాలని డిమాండ్ రాజ్యాంగ బద్దంగా పౌరులకు సంక్రమించిన నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారంటూ, పోలీసుల తీరుకు నిరసనగా భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ తన ఇంట్లోనే మౌన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన తర్వాత అయన విలేకర్లతో మాట్లాడుతూ మదనపల్లె రూరల్ మండలం, అంకిశెట్టిపల్లి సమీపంలోని బుద్ధునికొండపై గత ఆర్నళ్లుగా అమలు చేస్తున్న సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ నిషేధాజ్ఞలు వెంటనే ఎత్తివేయాలని, భగవాన్ బుద్ధుడి ప్రధాన విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప ముళ్ళకంచెను తొలగించి, భగవాన్ బుద్ధుని పూజలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకూ అనుమతి ఇవ్వాలని కోరుతూ, బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట "మౌన దీక్ష" పేరుతో నిరసన కార్యక్రమానికి భారతీయ అంబేడ్కర్ సేన, బుద్ధ అంబేడ్కర్ సమాజ్ పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుమతి కొరకు ప్రొసీజర్ ప్రకారం మూడు రోజుల ముందే ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేసుకున్నా, చివరి క్షణంలో అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసులు చెప్పారని, దీంతో పోలీసుల తీరుకు నిరసనగా తాను ఇంట్లోనే మౌన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. మదనపల్లె బుద్ధవిహారలో ఇప్పటి వరకూ నాలుగుసార్లు బుద్ధుడి విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయని, ఈ దుర్ఘటనలపై తీవ్రంగా స్పందించాల్సిన పోలీసులు, రెవిన్యూ అధికారులు నిందితులకు కొమ్ముకాస్తూ, ఉద్దేశ్య పూరకంగా కేసును ననీరుగార్చేశారని ఆరోపించారు. కుల వివక్షతో దళితులు ఆరాధించే బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేయించడమే కాక, లక్షల రూపాయల పంచాయతీ నిధులు మింగేసి, ప్రభుత్వ భూములు అమ్ముకొని చెక్ పవర్ పోగొట్టుకున్న ఒక సర్పంచ్ తో అంటకాగుతూ సీఐ, తహసీల్దార్లు ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తప్పుడు సమాచారం ఇచ్చి, సున్నితమైన సమస్యను సీఐ, తహసీల్దార్ లు జఠిలం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వాస్తవాలు తెలుసుకొని ధర్మం వైపు నిలబడాలని, బుద్ధునికొండపై సెక్షన్ 163 నిషేధాజ్ఞలు తొలగించి, బుద్ధుని పూజలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్నెళ్ల నుండి ఇంతగా ప్రచారంలో ఉన్నా, ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్పందించక పోవడం అన్నారు. ఈ సమస్యను ఇంకా తాత్సారం చేస్తే, ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధంపై కొనసాగుతున్న ద్వేషాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, మర్చి 13న ఛలో ఢిల్లీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బాస్ నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, జి.వి. రమణ, వై. గంగాధర్, బురుజు రెడ్డిప్రసాద్, రవిశంకర్, తలారి కృష్ణ, జనార్దన్ తదితరులు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు.
Reporter
Namitha News