నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 12వ వేతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు బకాయిలు చెల్లించాలి: చింతామోహన్ ఘాటు డిమాండ్ అమరావతి ఖర్చులపై విమర్శలు.. తిరుపతి రాజధాని అవుతుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సి నీ వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లెలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టి అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వీరికి రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. నెల రోజులలోపు ఈ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా వేతన సవరణ పెండింగ్లో ఉండటంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా, ఎనిమిదేళ్లుగా అమలు కాకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. 1958లో బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వేతన సవరణను అమలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించిన ఆయన, అమరావతి నిర్మాణంపై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేతన సవరణపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆరుగురు మంత్రులను వినోద యాత్రల పేరుతో సింగపూర్కు పంపించి ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులకు పెన్షన్లు, ఇతర ప్రయోజనాలు సకాలంలో అందించడం లేదని, పెరుగుతున్న ధరలతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చాలా మంది ఉద్యోగులు అప్పులు తీసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారని, తమ పిల్లల విద్య కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ప్రాజెక్టుపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతామోహన్, అమరావతి విఫలమవుతుందని, రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు తిరుపతి రాజధానిగా అవతరిస్తుందని అన్నారు. అమరావతి రైతులు ప్రభుత్వం మాటలను నమ్మవద్దని సూచించారు. స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శతాబ్దాల క్రితం చేసిన ప్రవచనాల్లో తిరుపతి ప్రాధాన్యం ప్రస్తావన ఉందని, అది నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతులు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు పండిస్తున్న పంటలకు సరైన ధరలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్, ప్రముఖ దళిత నాయకులు యమలా సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు సమీఉల్లా, మీనా కుమారి, ముబారక్ ఖాన్, ఖాదర్ బాషా, మహబూబ్ ఫీర్, శరత్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ నాయక్, మహమ్మద్ అలీ, ఆర్ నాగరాజ, పాలేటి, బి. నాగరాజ, ఈశ్వరమ్మ, గంగులప్ప, బయ్యా రెడ్డి, ఖాసిం వల్లి, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News