నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఫిబ్రవరి 06 : రాయచోటి పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి వృత్తి నైపుణ్య పరీక్షలు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆయుధమే కవచమని, దాని వినియోగంపై ప్రతి ఒక్కరికీ తిరుగులేని పట్టు ఉండాలని, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. శుక్రవారం కడప శివార్లలోని ఫైరింగ్ రేంజ్లో నిర్వహించిన ఏఆర్ ‘మొబిలైజేషన్’ శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు ఎస్పీ గారు. స్వయంగా రంగంలోకి దిగి ఏకే-47, ఎస్ఎల్ఆర్, మరియు అత్యాధునిక గ్లాక్ పిస్టల్తో లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించి అందరినీ అశ్చర్యపరిచారు. ఎస్పీ గారి ఫైరింగ్ ప్రతిభను చూసి అక్కడి సిబ్బంది ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఆయుధాన్ని వాడటం అంటే కేవలం కాల్చడం మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో ఎంత వేగంగా స్పందిస్తామనేదే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాయచోటి పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ సిబ్బందికి ప్రత్యేక వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఏఆర్ డిఎస్పీ ఏడుకొండల రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్క్వాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్ తో సిబ్బంది చురుకుదనాన్ని పరిశీలించారు. అత్యాధునిక ఆయుధాలను అతి తక్కువ సమయంలో విడదీయడం, తిరిగి అమర్చడం వంటి అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిడిని జయించేందుకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే మన ప్రథమ కర్తవ్యం. ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పుడే విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరంతర సాధన ద్వారానే వృత్తిపరమైన మెళకువలు సొంతమవుతాయి" అని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గారు, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర గారు, రాయచోటి డిఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారు, ఏఆర్ డిఎస్పీ డి. ఏడుకొండల రెడ్డి గారు మరియు ఇతర పోలీసు అధికారులు, ఏఆర్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
Namitha News