నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28: నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమవుతున్న సందర్భంగా, అన్నమయ్య జిల్లా ప్రజలను హెచ్చరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి శనివారం ఒక కీలక సందేశాన్ని విడుదల చేశారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, క్రికెట్ను కేవలం క్రీడలాగే చూడాలని ఆయన పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఆశకు పోయి జీవితాన్ని పాడుచేసుకోవద్దంటూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని బుకీలు చెప్పే మాటలు నమ్మకండి. బెట్టింగ్ అనేది ఒక విషవలయం. ఒక్కసారి అందులో పడితే అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం రోడ్డున పడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని తెలిపారు. బుకీలకు చెక్ పెట్టాలి, అమాయక విద్యార్థులను, యువతను ఆకర్షించే బుకీల ఆటలు సాగనివ్వమని, అక్రమాలకు పాల్పడితే కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్ట్ లో హాజరు పరుస్తామని స్పష్టం చేశారు. ఆన్లైన్ జూదగాళ్లపై నిఘా పెట్టాం స్మార్ట్ఫోన్లలో సీక్రెట్ యాప్స్, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపులు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహించే ముఠాలపై స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాం. ప్రతి పైసా లావాదేవీని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు, యువత జాగ్రత్త గా ఉండాలి సరదాగా మొదలయ్యే ఈ అలవాటు మీ కెరీర్ను దెబ్బతీస్తుంది. పోలీస్ కేసు నమోదైతే ఉద్యోగాలు, పాస్పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకోవాలని ఎస్పీ గారు సూచించారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి:* మీ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా ఏం చూస్తున్నారు? వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా? అనేది గమనించండి. వారి బ్యాంక్ ఖాతాల నుంచి అనుమానాస్పదంగా డబ్బులు కట్ అవుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి
ప్రజలు సహకరించాలని తెలియచేస్తూ మీ ప్రాంతంలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100/112 కి లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు
Admin
Namitha News