నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో భారీచోరీ - కట్టర్లతో గేట్లు,తలుపులు ధ్వంసం చేసిన దొంగలు - రూ. 25 లక్షల నగదు,వెండి కిరీటాలు అపహరణ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు.ఏకంగా దేవుని గుడినే కొల్లగొట్టారు.అనపగుట్టలో కొలువున్న శ్రీకృష్ణుని ఆలయం తలుపులు,గేట్లను కట్టర్లతో ధ్వంసం చేసి రెండు హుండీలలోని నగదు,దేవుళ్ళ విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు బంగారు తాళి బొట్లు,ఇతర నగలు,నగదును దొంగలు దోపిడీ చేశారు.మంగళవారం ఉదయం శ్రీకృష్ణుని ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన ఆలయ పూజారికి గుడిలో చోరీ జరిగిందని గుర్తించి వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు.వారు వెంటనే ఒకటవ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ మహమ్మద్ రఫీ ఎస్సై రహీముల్లా,శ్రీరాములు,సిబ్బంది హుటాహుటిన అనపగుట్టకు చేరుకుని కృష్ణుని ఆలయంలో చోరీ జరగడాన్ని పరిశీలించారు.విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లడంతో డాగ్ స్క్వాడ్,క్లూస్ టీంలను మదనపల్లికు పంపించారు.అనపగుట్టలోని కృష్ణుని ఆలయం వద్దకు చేరుకున్న జాగిలాలు,క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించి అణువణువు గాలించారు.దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు,అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఆలయంలో ఉన్న వాచ్మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లడం గమనించిన దొంగలు గ్యాస్ కట్టర్లు వినియోగించి తలుపులు కిటికీలను ధ్వంసం చేసి గుడిలో ఉన్న రెండు పెద్ద సైజు హుండీలను ధ్వంసం చేసి అందులోని నగదును పెద్ద మొత్తంలో అపహరించారు.అలాగే శ్రీకృష్ణుడి కిరీటం,సత్యభామ మెడలో ఉన్న బంగారు మంగళ సూత్రాలు,ఇతర దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు సుమారు రూ.25 లక్షలకు విలువైన నగలు నగదు అపహరించుకుపోయారు.చోరికి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా,దొంగలు శ్రీకృష్ణుని గుడిలో చోరీకి పాల్పడం బాధాకరమన్నారు.నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Reporter
Namitha News