నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 30 న ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రమాదకరమైన విబిజి ఆర్ఎఎం జి, విద్యుత్ చట్టాల సవరణ, లేబర్కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకువస్తోందని చెప్పారు. ప్రజలు తేరుకునే లోపే వీటిని అమలులోకి తీసుకువస్తోందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనవరి 30న మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చెయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపుంచ్చిందని జయప్రదం చెయ్యాలని పిలునిచ్చారు. విబిజీ ఆర్ఎఎం జీతో ప్రజలకు తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులిచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందని, పనిదినాల్లోనూ కోత పెట్టిందని విమర్శించారు. ఆ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని, దేశంలో సామాజికన్యాయం పూర్తిగా దెబ్బతిని, దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇటీవల చేసిన కొన్ని సవరణలతో కూలీలకు పని కల్పించడం కష్టమై, పథకం నిర్వీర్యమవుతుందని అన్నారు. కూలీల అవసరాల మేరకు కాకుండా కేంద్రానికి తోచిన సమయంలో పని ఇచ్చే విధంగా సవరణ పెట్టారని, దీనివల్ల పని కల్పించడం కష్టమవుతుందని తెలిపారు. విద్యుత్ చట్టానికి సవరణలు చేయడం ద్వారా పేదలకు అందే క్రాస్సబ్సిడీ రద్దవుతుందని పేర్కొన్నారు. రెగ్యులేటరీ కమిషన్ హక్కులను కూడా కేంద్రం లాగేసుకుంటుందని, పేదలపై మోయలేని భారం పడుతుందని తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ఇచ్చే సబ్సిడీని ఎత్తేస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి లేబర్కోడ్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారని, దీనివల్ల కార్మికులు కనీస హక్కులతోపాటు సమ్మె హక్కునూ కోల్పోతారని, ఎనిమిది గంటల పనివిధానం రద్దవుతుందని తెలిపారు. యూనియన్ల కోసం కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులన్నీ నిర్వీర్యం అవుతాయని తెలిపారు. ప్రమాదకరమైన మినీ న్యూక్లియర్ పవర్ప్లాంట్లను విదేశీ వ్యక్తులు నేరుగా ఏర్పాటు చేసుకునేలా బిల్లు తెస్తున్నారన్నారు. వాటిల్లో ప్రమాదం జరిగి నష్టం వాటిల్లితే దానికి వారు బాధ్యత వహించరని, ప్లాంటు రేడియేషన్, ప్రాణనష్టానికి కూడా విదేశీ వ్యక్తుల బాధ్యతలేని విధంగా చట్టాలు ఉన్నాయని, ఇవి అమల్లోకి వస్తే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. సీడ్ బిల్లు వల్ల మోన్శాంటో, కార్గిల్ వంటి సంస్థలకు లాభాలు వస్తాయని, వ్యవసాయం దెబ్బతినిపోతుందని హెచ్చరించారు. ఇటువంటి చట్టాలను అత్యంత వేగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమల్లోకి తెస్తోందని, వీటిని సిపిఎం వ్యతిరేకిస్తున్నదని, ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్దఎత్తున ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, ఆఫ్రిది తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News