నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - నవంబర్ 24 : విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేందుకు ఫౌండేషనల్ లిటరసీ & న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) బేస్లైన్ సర్వేను ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన 3,689 ప్రాథమిక పాఠశాలల్లో 1,11,587 మంది విద్యార్థులపై ఈ సర్వేను లీప్ యాప్ ద్వారా సోమవారం ప్రారంభించారని చెప్పారు. సర్వేలో డైట్ విద్యార్థులు, సీ ఆర్ పీలు, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు పాల్గొంటున్నారని వివరించారు. విద్యార్థుల బలహీనతలు, వెనుకబడిన పాఠశాలలు, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ వంటి అంశాలను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం స్పష్టంగా గుర్తించగలదని చెప్పారు. దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా రిమిడియల్ బోధన, ప్రత్యేక శిక్షణలు, విద్యా నాణ్యత మెరుగుదల కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. తదనంతరం డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి రాయచోటి మండలం అబ్బవరం హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సర్వే నిర్వహణను పరిశీలించి సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అంతిమ లక్ష్యం 1–5 తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకాలను సులువుగా చదవడం, గణితంలోని ప్రాథమిక లెక్కలు చేయగలగడం, తద్వారా ఉన్నత తరగతుల్లో అభ్యాసంలో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చాత్రోపాధ్యాయిని సాగరిక, సిఆర్పి విజయలక్ష్మి, ఉపాధ్యాయిని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News