నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : ఏపీఎస్పీడిసిఎల్, నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అన్నిరకాల పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడిసిఎల్ సిఎండి ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. ఎపిఎస్పిడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ఏపీఎస్పీడిసిఎల్ సర్కిల్ పరిధిలోని ప్రాంతీయ జిల్లాల కలెక్టర్లు, సంబందిత ఎస్ఈ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె కలెక్టరేట్ నుండి హాజరయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం గతంలో అన్నమయ్య జిల్లాకు కేటాయించబడిన 19 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం కడప జిల్లాకు మార్చబడినందున మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు కనీసం 30 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి భూమిని గుర్తించి నివేదికలు పంపాలని సూచించారు. సీఎస్ విసి ముగిసిన ఆనంతరం.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం కుసుం పురోగతి, పీఎం-సూర్య ఘర్ పురోగతి, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు, సూచనల మేరకు.. 2026 డిసెంబర్ నాటికి పిఎం కుసుమ్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్న ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ (ఎఫ్.ఎల్.ఎస్.) కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, ఫీడర్ల ఏర్పాటు తదితర పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీడిసిఎల్ అధికారి సోమశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News