నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ చట్టం ముందు అందరూ సమానమే – అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వేంపల్లి గ్రామంలో దళిత డప్పు కళాకారులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ నెల 12న చెన్నకేశవ స్వామి ఊరేగింపు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై అందిన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించిన ఎస్సీ కమిషన్, నేడు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు, మేకల బిక్షం, పి. గౌతమ్ రాజ్ గ్రామ సచివాలయంలో గ్రామస్తులను, బాధిత డప్పు కళాకారులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. అనంతరం మదనపల్లి రూరల్ సీఐ కళా వెంకటరమణ, ఎస్సై రామకృష్ణారెడ్డి లను కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామస్తుల ఆహ్వానం మేరకు జాతరకు వచ్చి జీవనోపాధి కోసం డప్పులు వాయిస్తున్న దళిత కళాకారులపై ఎస్సై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. గ్రామంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య ప్రదర్శన జరుగుతున్న సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈ విధంగా ప్రవర్తించడం ఆందోళనకరమన్నారు. వివక్ష రహిత సమాజ నిర్మాణమే ఎస్సీ కమిషన్ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని సూచించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదికను ఎస్సీ కమిషన్ చైర్మన్కు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, పసల చంద్రశేఖర్, రామకృష్ణ, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, ఏఎస్డబ్ల్యూఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News