నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సేవా దృక్పథాన్ని పెంచుకోవాలని, దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య అని సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ పేర్కొన్నారు. శనివారం ఉదయం మదనపల్లి కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ మాట్లాడుతూ.... దామోదరం సంజీవయ్య దళిత కుటుంబంలో పేదరికంలో పుట్టాడని, అట్టడుగు స్థాయి నుండి దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పదవులను అధిరోహించి తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేశారన్నారు. మద్రాసు లో లా చదువుకొని తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి మరియు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ గా రెండేళ్లు పనిచేశారని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాదులో ఉన్న సంజీవయ్య పార్కుకు ఆయన జ్ఞాపకార్థం సంజీవయ్య పార్క్ అని నామకరణం చేశారన్నారు. అలాగే విశాఖపట్నంలోని లా విశ్వవిద్యాలయాన్ని ఆయన జ్ఞాపకార్థం దామోదరం సంజీవయ్య లా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారన్నారు. టీచర్లకు పింఛన్లు అందుతున్నాయి అంటే దానికి కారణం దామోదరం సంజీవయ్య అని, బడుగు బలహీన వర్గాలకు భూమి అందేలా ఎన్నో భూ సంస్కరణలను చేపట్టారని పేర్కొన్నారు. ఆయన జీవితాంతం సమాజ హితం కోసం పోరాడారన్నారు. పాఠశాల విద్యార్థులందరూ దామోదరం సంజీవయ్య జీవితం నుంచి స్ఫూర్తి పొంది, సమాజానికి ఉపయోగపడే పనులను చేయాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సభ్యులు, ఎమ్మార్పీఎస్ సభ్యులు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను జిల్లా కలెక్టరేట్లో జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. తన తల్లి నుండి స్ఫూర్తి పొంది సామాజిక పింఛన్లను ప్రారంభించిన మొదటి నాయకుడు దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. దాదాపు ఆరు లక్షల ఎకరాలను బడుగు బలహీన వర్గాలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ఏసీబీ సంస్థ ఏర్పాటు ఆయన వల్లనే సాధ్యమైందని కొనియాడారు
ఈ సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, కురబ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, కుమ్మరి మరియు శాలివాహన డైరెక్టర్ భావన, డివిఎంసి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మాల మహానాడు నాయకులు సుదర్శనం, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News