నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - ఏప్రిల్ 25 : బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు కట్టను కబ్జాల నుండి కాపాడాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,బి.కొత్తకోట మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్ట కబ్జా విషయం మీద శనివారం మండల తహసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ;బి.కొత్తకోట చెరువు కట్టను చెరువు కింద ఉన్నటువంటి భూస్వాములు తమ భూమిని ఎత్తు పెంచుకొని వానిజ్య సముదాయాలు నిర్మించుకునేందుకుగాను, పట్టణంలోని వేస్ట్ మట్టిని ట్రాక్టర్ల ద్వారా కట్టమీద నుండి తమ పొలాల్లోకి తరలించి,జెసిబిల ద్వారా చదును చేయించి చెరువు కట్టను ఆనవాళ్లు లేకుండా కబ్జా చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇప్పటికే చదునుచేసిన స్థలంలో వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చారని అన్నారు.చెరువు తూము నుండి ఆయకట్టు కోసం నీరు పారే కాలువలు కూడా మూసివేసారని మండిపడ్డారు.ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం చెరువులు,కుంటలు నీటితో నింపడానికి కాలువలు,చెరువు కట్టలు మరమ్మత్తులు చేపట్టాలని,అన్ని చెరువులనూ నీటితో నింపడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కూడా,ప్రతిరోజూ అధికార యంత్రాంగం ప్రయాణించే రహదారిలో ఉన్న పెద్ద చెరువు కట్ట కబ్జాలు కనపడుతున్నా కూడా వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం,కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని వారన్నారు.సదరు కబ్జాల సాకుతో కట్టకింద ఉన్న మిగిలిన భూ యజమానులు కూడా అదే విధంగా కట్టను కబ్జా చేసే ప్రమాదం పొంచి ఉన్నదని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని సదరు కబ్జాలను తొలగించి చెరువు యొక్క తూములను,కాలువలను కాపాడాలని,లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చెరువుకట్ట మీదనే ఆందోళనలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఏస్.తంబయ్యశెట్టి,చెన్నకేశవులు పాల్గొన్నారు
Reporter
Namitha News