నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 ః తంబళ్లపల్లె మండలం రెడ్డికోట వద్ద ప్రభుత్వ ఏపీఐఐసి గుర్తించిన భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపనకు అధికారులు తరలి వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూములను లాక్కుంటున్నారని కడప-మదనపల్లి హైవే రోడ్డుపై అడ్డంగా బైఠాయించి రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ స్తంభించి వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తంబళ్లపల్లి మండలం రెడ్డికోట ప్రధాన హైవే పక్కన ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి స్థానిక రెవిన్యూ అధికారులు ఏపీఐఐసీ అధికారులకు సర్వే నెంబర్లు 906, 907,908లో 20.981 ఎకరాల ప్రభుత్వ భూమి గా గుర్తించి కేటాయించారు. గత నెల రోజుల క్రితమే ఈ ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించిన భూములలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. అప్పట్లోనే ఆ భూములు సాగు చేసుకుంటున్న వెనుకబడిన, దళిత రైతులు అధికారులను నిలదీయగా అధికారులు రికార్డులలో ఈ భూమి మీ పేర్లతో లేదని తేల్చి చెప్పడంతో వారు అప్పట్లోనే ఆందోళనకు దిగారు. రైతులు తాము గత 50 ఏళ్లుగా ఈ భూములు సాగు చేసుకుంటున్నామని ఈ భూములే మాకు జీవనాధారం అని ఈ భూములు కోల్పోతే మాకు ఆత్మహత్య శరణ్యమని తేల్చి చెప్పారు. ఈ విషయమై బాధిత రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. అయితే సోమవారం ఏపీఐఐసీ అధికారులతో బాటు తాసిల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది, మండల డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, ఏవో థామస్ రాజా, ఐకెపి ఎపిఎం గంగాధర్ అధికారులు భూముల వద్దకు చేరుకున్నారు. బాధిత రైతులు హైవే రోడ్డుపైనే అధికారులతో వాగ్వివాదానికి దిగి రోడ్డుకు అడ్డంగా తమ ద్విచక్ర వాహనాలు ఉంచి బైటాయించి ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కొందరు యువకులు పెట్రోల్ పోసుకొని అంటించుకోవడానికి ప్రయత్నించగా ప్రజలు అడ్డుకొని లాక్కున్నారు. తమకు దశాబ్దాలుగా జీవనాధారమైన భూములకు రికార్డులు లేవని రెవిన్యూ అధికారులు చెప్పడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంటకు పైగా హైవే పై రైతుల ఆందోళన తో వందలాది వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న తంబళ్లపల్లె ఏఎస్ఐ నజీర్ భాష హుటాహుటిన తన సిబ్బందితో రైతులు ఆందోళన వద్దకు చేరుకొని రైతులు, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అధికారులు సహకరిస్తారని ఒప్పించి నిరసన కార్యక్రమాన్ని శాంతింప చేశారు. సమస్య సద్దుమనగడంతో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాహన చోదకులు, అధికారులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చు కున్నారు. ఈ ట్రాఫిక్ లో చిన్నమండెం సీఎం ప్రోగ్రాం బందోబస్తు వెళ్తున్న మదనపల్లె పోలీస్ వాహనం నిలిచిపోవడం కొసమెరుపు. రైతులు విలేకరులతో మాట్లాడుతూ మాకు జీవనాధారంగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Reporter
Namitha News