నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టి.. మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల కమిటీతో 'డ్రగ్స్ వద్దు బ్రో' సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తో కలసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణ రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పని చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెం.1972 కు ఫోన్ చేసి తెలిపేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. "డ్రగ్స్ వద్దు బ్రో" ప్రచార పోస్టర్లలో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్లతో జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలన్నారు. డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో వారం వారం జరిగే మహిళా సంఘాల కమిటీలలో ఈ విషయంపై తప్పనిసరిగా అజెండా పెట్టుకుని విస్తృతంగా చర్చ జరపాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఎవరైనా గంజాయి సేవించే వారి వివరాలు తెలిసినప్పుడు టోల్ ఫ్రీ మరియు వాట్సప్ నెంబర్లకు సమాచారం పంపించేలా విస్తృతంగా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని, సమాచారం అందజేసిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈగల్ క్లబ్ లను మరింత మెరుగ్గా పనిచేసేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల ఉత్పత్తుల వినియోగం, అమ్మకాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గుట్కాను కూడా కంట్రోల్ చేయాలని, మైనర్లకు తుపాకోను విక్రయిస్తే సదర్ షాపులను సీజ్ చేస్తామని మున్సిపాలిటీలలో, పంచాయతీలలో అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో ఉన్న అతిపెద్ద మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం జనవరి 26 నుండి ఇప్పటివరకు మొత్తంగా 17 కేసులలో 129.66 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 78మంది అమ్మకందారులను, 21మంది వినియోగదారులను, 4మంది రవాణా సరఫరా దారులు, ఒక రిటైల్ వ్యాపారిని గుర్తించామన్నారు. ఇందులో భాగంగా 109 మంది నిందితులను గుర్తించి, 94 మందిని అరెస్ట్ చేసామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం“ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో 30 రోజుల పాటు నిరంతర మాదకద్రవ్యాల నిరోధక కార్యక్రమాన్ని ప్రారంభమైన తర్వాత జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, చిల్లర విక్రయ నెట్ వర్కులను నిర్మూలించడం, వాణిజ్య మరియు సరఫరాల గొలుసులను అంతరాయం కలిగించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక దాడులు మరియు గస్తీ చర్యలను మరింత వేగవంతం చేసినట్లు తెలిపారు. విద్యాశాఖ, పోలీస్ శాఖ వారు సమన్వయంతో 55 ఈగల్ క్లబ్స్ ద్వారా జిల్లాలో ప్రతినెల స్కూల్లో, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి, డీఎస్పీలు, డీఈవో, డిఎంహెచ్ఓ, మదనపల్లె ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అడిషనల్ డి సి హెచ్ ఎస్, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, జిల్లాఅధికారులు, డిఎస్పి, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News