నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 25 : ఈ నెల 20 నుండి 25 వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్ నందు నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ లో అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు మహమ్మద్ సుహేల్ మరియు రెహాన్ లు గ్రూపు విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు.ఈ పోటీలలో దక్షిణ భారతదేశానికి చెందిన ఎనిమిది రాష్ట్రాల నుండి 270 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. సుహేల్, రెహాన్ లు ప్రదర్శించిన బయోఎంజైన్స్ అను ప్రాజెక్టు గ్రూపు విభాగము నుండి దక్షిణ భారతదేశ సైన్స్ ప్రదర్శనలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ సెల్వం, విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం చేతుల మీదుగా రూ. 2000/- నగదు, మెమెంటో, ప్రశంసా పత్రాలను వీరు అందుకొన్నారు. వీరికి సుమతి గైడ్ టీచర్ గా వ్యవహరించారు. సైన్స్ ప్రాజెక్ట్ ల ప్రదర్శనలో దక్షిణ భారతదేశ స్థాయిలో అన్నమయ్య జిల్లా కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విద్యార్థులను మరియు గైడ్ టీచర్ ను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివ ప్రకాష్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, ప్రిన్సిపల్ మలామ్ షా వలి అభినందించారు.
Admin
Namitha News