నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మోడీ సర్కారు బాటలోనే కార్పొరేట్ల సేవ కోసం పని గంటల పెంపు - ప్రతిఘటన తోనే హక్కుల రక్షణ - సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా జూలై 9న యావత్ కార్మికవర్గం దేశవ్యాపితంగా సమ్మెకు సన్నద్దమవుతున్న దశలో మన రాష్ట్రంలో పనిగంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బాటలో రాష్ట్రప్రభుత్వం కార్మికలోకంపై పెనుదాడి చేసిందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా దిగమింగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికారం కట్టబెట్టి (ఎన్నికల ఫలితాలు వెలువడి) జూన్ 4వ తేదికి సంవత్సరం అయిందని, ఏడాది తరువాత సరిగ్గా అదేరోజు రాష్ట్రంలోని కార్మికుల ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కబళించి, వారి మూలుగులను మరింతగా పీల్చి పిప్పి చేసే నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పనిదినం ఆచరణలో ఎప్పుడో తొమ్మిది గంటలకు చేరుకోగా, తాజా మంత్రివర్గ సమావేశంలో దానిని పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కార్మికులకు ప్రతి 5 పని గంటలకు అరగంట విరామం ఉండగా, ఇప్పుడు ఆ కాసింత విశ్రాంతి కోసం మరో గంట అదనంగా రెక్కలు ముక్కలు చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం కార్మికలోకాన్ని ఆదేశించిడం దుర్మార్గం అన్నారు. మహిళా సాధికారత పేరుతో మహిళలకు కూడా నైట్షిఫ్ట్ల భారాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంలోని అంతర్యమేమిటని ప్రశ్నించారు. 8 గంటల పనికోసం పోరాడి సాధించుకున్న కార్మికవర్గంపై 12 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమన్నారు. కార్మికుల రక్తమాంసాలు పిండి కార్పొరేట్లకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పనిగంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదన్నారు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని.. కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నదన్నారు. ఈ స్థితిలో పనిగంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సిందిపోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమని తెలిపారు. తక్షణం లేబర్ కోడ్స్, దాని అనుబంధ రూల్సు ఉపసంహరించుకోవాలని కోరారు. దీనికి వ్యతిరేకంగా జూలై 9న జరగనున్న జాతీయ సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు ప్రకటించిందని గుర్తుచేశారు. యావత్ కార్మికవర్గం ఐక్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంక్షేమం దష్ట్యా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Reporter
Namitha News