నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 30 : తంబళ్లపల్లె మండలం జుంజుర పెంట పంచాయతీ పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టు కాలువల మరమ్మత్తు పనులతో భవిష్యత్తులో రైతులకు సాగునీరు తోబాటు పశువులకు తాగునీరు అంది మహర్దశ పట్టబోతోంది. గత కొంతకాలంగా పెద్దేరు ప్రాజెక్ట్ కుడి ,ఎడమ కాలువలు ముండ్ల కంపలు, పిచ్చి మొక్కలు పెరగడంతో పాటు అటవీ ప్రాంతాన్ని తలపించే విధంగా తయారైంది. కూటమి ప్రభుత్వం రాకతో పెద్దేరు ఆయకట్టు చైర్మన్ కొట్టాల శివకుమార్ కోరిక తో తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి చొరవ తీసుకొని ప్రాజెక్టు కాలువల మరమ్మత్తులకు కోటి రూపాయలు మంజూరుకు కృషి చేశారు. గత నెల రోజులుగా ప్రాజెక్ట్ కాలువ పనులు కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి చైర్మన్ శివకుమార్, కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతుల సలహాలు, సూచనలతో మరమ్మతు పనులు నాణ్యతా లోపం లేకుండా శరవేగంగా చేస్తున్నారు. ప్రాజెక్ట్ కుడి కాలువ 17 కిలోమీటర్లు, ఎడమ కాలువ 15 కిలోమీటర్లు లో పూర్తిగా కంపచెట్లు తొలగింపు, కాలువ పక్కన రహదారులు, కాలువలో గండ్లు పటిష్టంగా పూడ్చేపనులు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ కాల్వ మరమ్మత్తు పనులు జరగడం ఇన్చార్జి జయ చంద్రారెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి చలవేనని ప్రాజెక్టులో ఇంకా తాగునీటి బోరు, విద్యుత్తు, పార్కుల మరమ్మతులు, కార్యాలయ మరమ్మతులు, క్వార్టర్స్ మరమ్మతులు,మరుగుదొడ్లు, బోటింగ్ సిస్టం, ఇంకా పలు అభివృద్ధి పనులు పూర్తయితే జిల్లాలో పెద్దేరు ప్రాజెక్టు ప్రముఖ పర్యాటక కేంద్రం తో పాటు వేలాది ఎకరాల కు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాల పెంపుతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News