నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఆగస్ట్ 03 : తంబళ్లపల్లె మండలం లో ఖరీఫ్ సీజన్ లో వేసిన వేరుశనగ పంట వర్షం లేక నిట్ట నిలువునా ఎండిపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో మండలంలోని బాలిరెడ్డిగారిపల్లి, కోసువారిపల్లె, ఎద్దుల వారి పల్లె, ఎర్రసానిపల్లె, కన్నె మడుగు, గోపిదిన్నె, మర్రి మాకులపల్లి, రేణు మాకులపల్లె, కోటకొండ, జుంజురపెంట, దిగువపాలెం, గుండ్లపల్లి, గంగిరెడ్డిపల్లి పంచాయతీలలో అక్కడక్కడ రైతులు వేరుశనగ పంట గంపడాశతో విత్తారు. వర్షాన్ని నమ్ముకుని ఎకరాకు రూ10వేల నుండి రూ12 వేల వరకు ఖర్చు చేసి వేరుశనగ పంట విత్తిన మొదలు వర్షమే రాకపోవడంతో వేరుసెనగ మొక్కలు ఎండకు నిలువునా ఎండిపోతున్నాయి. వేరుశనగ పంట చేతికి వచ్చే సూచనలు లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. జీవనోపాధి కోసం విధిలేని పరిస్థితుల్లో ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పడం లేదు. మరికొందరు రైతులు ఆర్థిక స్థోమత లేక ఖరీఫ్ సాగు పై ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం వెంటనే రైతులకు పంట నష్ట పరిహారం, పశువులకు పశుగ్రాసం, పూర్తి సబ్సిడీతో ప్రత్యామ్నాయ పంట విత్తనాలు పంపిణీ తో పాటు విరివిగా ఉపాధి హామీలో పని దినాలు పెంచి పనులు కల్పించకపోతే వలస బాట పట్టడం ఖాయం.
Reporter
Namitha News