నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 22 ః తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నిరుపేదకు సకాలంలో వైద్య సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో పలు తనిఖీలతో సుడిగాలి పర్యటన చేశారు. ఆసుపత్రి లోని దంత వైద్యం, బాలింతల వార్డు, ఎక్స్ రే యూనిట్, ఓ.పి తనిఖీ చేసి రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఎంపీడీవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు లతో మధ్యాహ్న భోజనం తనిఖీ తో పాటు రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ తో పాటు క్రమశిక్షణ తో కూడిన విద్య అందించాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జరిగిన సమీక్ష ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి మనసుపెట్టి ఉద్యోగ ధర్మం నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు. గృహ నిర్మాణాలలో నిర్దేశిత లక్ష్యాలను అధిగమించడానికి చొరవ చూపాలని సూచించారు. ఆయన వెంట ఏఈ సుజాత, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది గ్లోరీ, ఎల్టి బాలాజీ, కస్తూరిబా గురుకుల అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Reporter
Namitha News