నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంగన్వాడి సెంటర్లకు పిల్లలు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాలి! *పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడి కేంద్రంలో ఉండాలి* *పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం ఇవ్వాలి* *ఎత్తు, బరువు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి* బాల్యవివాహాల నిర్మూలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి! జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి! *రాయచోటి :నమిత న్యూస్: ఆగస్టు 7:-* అంగన్వాడి సెంటర్లకు పిల్లలు వంద శాతం హాజరయ్యేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అంగన్వాడి సిబ్బందికి సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, సిడిపిఓలు, సూపర్వైజర్లు, బిపిసి, డి పి సి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లలో పిల్లలు తప్పకుండా 100% హాజరయ్యేటట్లు చూడాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండేటట్లు చూడాలన్నారు. చిన్నారులకు ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన భోజనం ఇవ్వాలన్నారు. చాలామంది పేద పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తుంటారని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చే విధంగా చూపాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులందరికీ మంచి విద్య నేర్పించి వారు బాగా చదువుకునేటట్లు చూడాలన్నారు. ప్రతి ఒక్కరు విద్యావంతులైతేనే రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అంగన్వాడి కేంద్రంలో ఆయా మొదలుకుని సూపర్వైజర్ వరకు చిన్నారుల అటెండెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రాకపోయినా అటెండెన్స్ వేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రంలో చదివే చిన్నారులందరికీ ఆధార్ కార్డు ఉండటట్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడి కేంద్రాల బలపటానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతోందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి బాధ్యతగా తమ విధులు నిర్వహించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో ఎత్తు,బరువు తక్కువగా ఉన్న పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను గుర్తించి వారిని వైద్యాధికారి వద్దకు తీసుకెళ్లి బరువు, ఎత్తు తగ్గడానికి గల కారణాలను తెలుసుకొని తగు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లాలో రక్తహీనత ఉన్న గర్భిణీలు, బరువు తక్కువ ఉన్న పిల్లల సంఖ్యను జీరో శాతానికి తీసుకురావడానికి తగు జరగా చెప్పటాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగినట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. ఇకనుంచి మన జిల్లాలో ఒకటి కూడా బాల్య వివాహం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శశికళ, సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, బిపిసిలు, డిపి సీలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News