నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 17 : తంబళ్లపల్లె తహశీల్దార్ కార్యాలయం శిధిలావస్థకు చేరుకుని కూలడానికి సిద్దంగా వుంది. కార్యాలయం తేలికపాటి వర్షానికి పైపెచ్చులూడి నీటి మడుగులు ఏర్పడి రికార్డులు సైతం తడిసిపోతున్నాయి. ఈ కోవలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తాసిల్దార్ కార్యాలయంలో గదులన్నీ పూర్తిగా నీటిమడుగు లయ్యాయి. ఈ కోవలో బుధవారం అర్ధరాత్రి కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి వైర్లు దగ్ధం అవుతుండగా కార్యాలయంలోని సిబ్బంది హుటాహుటిన తాసిల్దార్ హరిప్రసాద్ కు సమాచారం అందించారు. వెంటనే తాసిల్దార్ కార్యాలయం చేరుకొని విద్యుత్ సరఫరా ఆపివేసి తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. గత నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన తహసిల్దార్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని చినుకు పడితే కార్యాలయంలోని గదులన్నీ నీటిమడుగులను తలపిస్తాయి. గత ఐదేళ్ల క్రితం అప్పటి టిడిపి ప్రభుత్వం తాసిల్దారు కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే అప్పట్లో నిధులు చాలవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కార్యాలయ పరిస్థితి మరింత దిగజారింది. తాసిల్దార్ కార్యాలయ దుస్థితిపై పలుమార్లు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న దాఖలు లేవు. ప్రతినిత్యం అధికారులతో పాటు వందలాదిమంది కక్షిదారులు కార్యాలయానికి వస్తూపోతుంటారు. వర్షం పడితే అధికారులే బిక్కు బిక్కుమంటూ కాలం వెలదీసే దుస్థితి నెలకొంది. ఇక కక్షిదారులైతే కార్యాలయం లోకి వెళ్లడానికి సాహసం చేసేవారు కాదు. గతంలో పలుమార్లు కార్యాలయం పై కప్పు పెచ్చులు ఊడి చిన్నపాటి ప్రమాదాల సైతం జరిగిన దాఖలాలు ఉన్నాయి. గత రెండేళ్ల క్రితం అప్పటి తాసిల్దార్ కార్యాలయాన్ని తాత్కాలికంగా అద్దె భవనంలోకి మార్చడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కనీసం పాత ఎస్టి బాలికల హాస్టల్ భవనంలోకి మార్చడానికి సైతం చేసిన ప్రయత్నం జరగలేదు. గురువారం కార్యాలయం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అధికారులు పనులు నిలిపివేసి లోపలికి వెళ్లడానికి భయపడి కార్యాలయం బయట వేచి చూడక తప్పలేదు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం తాసిల్దారు కార్యాలయాన్ని తాత్కాలికంగా వేరే చోటికి మార్చి నూతన భవన నిర్మాణానికి కృషి చేయాల్సి ఉంది.
Reporter
Namitha News