నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లేబర్ కోడ్లను రద్దు చేయాలి -- కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి -- పని గంటలు తగ్గించాలి -- వేధింపులు ఆపాలి -- సార్వత్రిక సమ్మెలో కదం తొక్కిన కార్మికులు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యాజమాన్యానికి అనుకూలంగా ఉండే లేబర్ కోడ్లుగా మార్చే దుర్మార్గపు ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా మదనపల్లెలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపాలిటీ, అంగన్వాడి, ఆశ వర్కర్స్, హమాలీ వర్కర్స్, పంచాయతీ వర్కర్స్, ఎలక్ట్రసిటీ, బిఎస్ఎన్ఎల్, బ్యాంకింగ్ రంగం లోని తదితర కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని కదం తొక్కారు. సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుంచి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటివరకు 22 సమ్మెలు జరిగాయని, అయితే నేటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రత్యేకత ఉందన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర దాగి ఉన్న లేబర్ కోడ్లను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చి, యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధానాలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చొప్పిస్తోందని ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున గొంతు విప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కనీస వేతనాలు చట్టాన్ని రద్దుచేసి, సమ్మె హక్కును కాలరాస్తూ యజమానులకు అనుకూలమైన చట్టాన్ని కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఇది చాలా దారుణమన్నారు. ఇందువల్ల యజమానుల గుప్పట్లోకి అన్ని హక్కులు వెళ్లిపోతాయని, వారు అనుకున్న సమయంలో సంస్థను మూసివేయొచ్చని, వారు అనుకున్న విధంగా కార్మికులకు వేతనాలు ఇవ్వవచ్చని, ఎప్పుడైనా సరే కార్మికులను తొలగించే వెసులబాటు ఉందని, పని గంటలు పెంచడం లాంటి ఎన్నో అనుకూల పరిస్థితులు యజమాన్యానికే అనుకూలంగా ఉంటాయన్నారు. కావున ఈ దుర్మార్గపు ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టి కార్మిక వర్గ చట్టాలను యధావిధిగా కొనసాగించాలన్నారు. వ్యవసాయ కార్మికులను కూలీలుగా, వలస కూలీలుగా మార్చే పద్ధతి లేబర్ కోడ్ల వల్ల వస్తుందని, దీనివల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వ్యవసాయ కార్మికులను బానిసలుగా మార్చే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ప్రజానీకాన్ని బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచి పెట్టి, ప్రజలను బిక్షగాలను చేసేందుకు లేబర్ కోడ్లు దోహదపడుతాయని మండి పడ్డారు. కార్మిక వర్గం ఉద్యోగులు అందరూ ఐక్యమై ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశమంటే అంబానీ, ఆదానీలే కాదని కార్మికులు, కష్టజీవులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ దేశంలో భాగమేనని గుర్తు చేశారు. వీరికి కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నానాటికి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజలు సైతం కార్మిక వర్గానికి మద్దతు ఇచ్చి, దేశ సంపద ప్రజలకే చేరేవిధంగా జరిగే ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వరి, మధురవాణి, సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు జయమ్మ, సవిత, పంచాయతీ వర్కర్స్ నాయకులు గోపాల్, ఎలక్ట్రిసిటీ యూనియన్ నాయకులు నారాయణ, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, అధిక సంఖ్యలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్స్, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసు ఆంక్షలు కార్మిక వర్గం బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతియుతంగా తమ గలాన్ని వినిపించేందుకు కార్మికులు చేపట్టిన శాంతి ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సమ్మె కు అనుమతించాలని దరఖాస్తు చేయలేదని, తమను కాదని శాంతియుత ర్యాలీ చేస్తే అందరి పైన కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు కార్మిక నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి కార్మికులు అనుకున్న ప్రదేశం వరకూ కాకుండా కొంతమేర శాంతిర్యాలి చేపట్టి తమపై జరుగుతున్న అరాచకాలపై మండిపడ్డారు.
Reporter
Namitha News